మెగా డీఎస్సీ రాసేందుకు ఏపీలోని నిరుద్యోగ యువత సిద్ధమవుతోంది. వీరిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లద్వారా అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వబోతోంది. అంతేకాదు.. వారికి నెలకు రూ.1500 స్టైఫండ్ కింద అందజేయనుంది. వీరు పరీక్ష రాసేందుకు అవసరమైన సబ్జెక్టు పుస్తకాలను కొనుగోలు చేసేందుకు అదనంగా మరో వెయ్యి రూపాయలను అందించనుంది. పరీక్షకు సిద్ధమవుతున్నవారికి శనివారం నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.
ప్రస్తుతం ఆఫ్ లైన్ లో ఇస్తున్న శిక్షణను త్వరలోనే ఆన్ లైన్ లో కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకునేందుకు అవకాశం లభించని విద్యార్థులను ఆన్ లైన్ శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందిస్తోంది. గతంలో పరీక్ష నిర్వహించి ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. సబ్జెక్టులవారీగా నిపుణులతో శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. బీఈడీతోపాటు టెట్ ఉత్తీర్ణులైనవారికే ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో శిక్షణ ఉంటుందని మంత్రి సవిత ప్రకటించారు.
మెగా డీఎస్సీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రకటించింది. వెనకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం బీసీ సంక్షేమశాఖ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీసీలకు 66 శాతం, 20 శాతం ఎస్సీ అభ్యర్థులకు, 14 శాతం ఎస్టీ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనకబడిన ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతం కేటాయించారు. ఒక్కో శిక్షణ కేంద్రంలో 200 మంది విద్యార్థులకు శిక్షణ అందుతుంది. రెండు నెలలపాటు 5200 మందికి శిక్షణ అందుతుంది.