E-PAPER

మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రోఫెసర్..!

క్రమశిక్షణ పేరుతో గుండు కొట్టించిన ఘటన ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది. దీనిపై అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు.

 

కళాశాల హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థి ఈనెల 12న రాత్రి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు. సెకండియర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్లీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. ఆ విద్యార్థి వచ్చేసరికి హాస్టల్లో యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థి కటింగ్ విషయాన్ని తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటికి తీసుకెళ్లి సెలూన్ షాప్ లో గుండు గీయించినట్ల విద్యార్థరోపించారు.

 

ఘటనపై విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ త్రీ మెన్ కమిటీ విచారణ కు ఆదేశించారు. సదరు అధికారిపై చర్యలకు కూడా సిఫార్స్ చేసినట్లు తెలిసింది. అటు నల్గొండ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిలను ర్యాగింగ్ చేశారని ముగ్గురు వైద్య విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. అందులో రెండో సంవత్సరం విద్యార్థిని ఒక నెల, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

 

చాలాకాలంగా మెడికల్ కాలేజీలో విద్యార్థినిల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజీ అధ్యాపక బృందం గుర్తించడంలో విఫలమైనట్లు చెబుతున్నారు. అభినవ్, మనీదీప్, బాలరాజ్, శరత్, నరేష్ జూనియర్లపై ర్యాగింగ్‎కు పాల్పడ్డట్లు తేలడంతో ఐదుగురిని ప్రిన్సిపల్ కాలేజీ నుండి సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. బాధిత విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram