ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. విశాఖ నుంచి అమరావతికి రెండు గంటల్లో వచ్చే విధంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రైల్వే లైన్ కోసం రూ 2500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బులెట్ రైలు కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను సిద్దం చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు బాగుంటేనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
సంక్రాంతిలోగా
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు. తాను ఎక్కడకు వెళ్ళినా పరదాలు లేవు, చెట్లు కొట్టడం లేదు. మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి రోడ్లు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను, మద్యాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు.
మంత్రికి ఆదేశాలు
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నారు. డబ్బులు ఊరికనే రావు… సంపద సృష్టిస్తే డబ్బులు వస్తాయన్నారు. రూ.860 కోట్లు తో రాష్ట్రంలో మొత్తం గుంతలు పూడుస్తున్నామన్నారు. రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను…గాడిలో పెడతానని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని రోడ్లు వేస్తామని ఇందుకోసం ఒక పక్కా ప్రణాళిక వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సంక్రాంతి లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్ల పైన గుంతలు పూడ్చే బాధ్యత తీసుకోవాలని అక్కడే మంత్రి జనార్ధనరెడ్డికి ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. 2014-19 కాలంలో 24 వేల కిలో మీటర్ల రోడ్లు వేసామని గుర్తు చేసారు.
విశాఖ రైల్వే జోన్
మాజీ సీఎం జగన్ పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ నాడు కేంద్రానికి సహకారం అందించలేదన్నారు. రూ 450 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగోలేదని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు కేటాయించామని.. త్వరలోనే శంకుస్థాపన జరగుతుందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ పైన చర్చలు జరుగుతున్నాయ ని ముఖ్యమంత్రి వివరించారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక హబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.