తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. బోనస్ ఈ సీజన్ నుంచే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధాన్యం సేకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ అనేక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధర (MSP)కు అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా, అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది అని సీఎం తెలిపారు.
సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించి, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలి. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించరాదు అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (DSC-2024)లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను అక్టోబర్ 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి విడుదల చేశారు.
దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 9 వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.