దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తులో నీట్ పేపర్ లీక్ నిర్ధారణ కావడంపై సుప్రీంకోర్టు కూడా ఇవాళ విచారణలో స్పందించింది. పేపర్ లీక్ ఇప్పటికే నిర్ధారణ అయిందని తెలిపిన సుప్రీంకోర్టు.. రీటెస్ట్ మాత్రం తమ చివరి ఆప్షన్ అని వెల్లడించింది. దీంతో నీట్ రీటెస్ట్ తప్పదా అన్న చర్చ మొదలైంది.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో పేపర్ లీక్ ఇప్పటికే నిర్ధారణ అయిన వాస్తవం అని తెలిపింది. అయితే 23 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తుతో ముడిపడిన రీటెస్ట్ అంశంపై నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.
నీట్ పేపర్ లీక్ కారణంగా జరిగిన మోసం లబ్దిదారులను ఇతర విద్యార్ధుల నుంచి వేరు చేయడం సాధ్యమేనా అని పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మోసం పరీక్ష మొత్తాన్ని ప్రభావితం చేసే స్ధితిలో ఉంటే మాత్రం రీటెస్ట్ నిర్వహించాల్సి అవసరం ఉంటుందన్నారు. అయితే మోసానికి పాల్పడిన అభ్యర్ధులను గుర్తించగలిగితే మాత్రం రీటెస్ట్ అవసరం ఉండదన్నారు. కాబట్టి దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని పరీక్ష నిర్వహించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.