తెలుగుదేశం పార్టీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత పాలన పరుగులు తీస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిస్తేజంగా ఉన్న పరిపాలనను పరిగెత్తించడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లపై ఆయన దృష్టిసారించారు. నిర్మాణం పూర్తిచేసుకొని లబ్ధిదారులకు అందించే దశలో కొన్ని ఉండగా.. చిన్న చిన్న పనులు చేస్తే సంపూర్ణంగా పూర్తయ్యే దశలో మరికొన్ని ఇళ్లు ఉన్నాయి.
కొత్తగా కట్టినంత ఖర్చవుతుంది 2014-19 మధ్య కాలంలో దాదాపుగా పూర్తయిన ఇళ్లను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వకుండా నిలిపివేసింది. తాజాగా అధికారం దక్కించుకున్న కూటమి టిడ్కో ఇళ్లపై హడ్కోతో చర్చించింది. వర్షాల వల్ల ఇళ్లు పాడైపోయాయని, వాటిని సరిచేయాలంటే కొత్తగా కట్టినంత ఖర్చవుతుందని తెలపడంతో హడ్కో రూ.2వేల కోట్ల రుణం అందించేందుకు సిద్ధపడింది. ఈ రుణం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు జరగనున్నాయి. నాలుగైదు నెలల్లోపే వీటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందివ్వబోతున్నారు.
చెల్లించాల్సిన బిల్లుల విలువే రూ.473 కోట్లు లబ్ధిదారులు తమ దరఖాస్తుకు సంబంధించిన ఎక్నాలడ్జ్ మెంట్ ను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు రూపొందిస్తుందా? అనే విషయాన్ని తెలుసుకొని వీరంతా తమ తమ పరిధిల్లోని ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాలని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. దీనికి రూ.5వేల కోట్లు అవసరం. ప్రస్తుత ప్రభుత్వం దగ్గర రూ.1300 కోట్లు ఉన్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన సొమ్ము రూ.1500 కలుపుకుంటే రూ.2800 కోట్లు అవుతుంది. కొన్నిచోట్ల అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలను ఈ నిధులు రాగానే ప్రారంభించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు చెల్లించాల్సిన బిల్లుల విలువ రూ.473 కోట్లుగా ఉంది.