ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు అసాధారణ రీతిలో విచారణ జరిపి స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఇవాళ వివిధ కోర్టులకు చెందిన 150 మంది లాయర్లు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఓ లేఖ రాశారు. ఇందులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిని తప్పుబడుతూ న్యాయాన్ని కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు.
ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత సదరు ఆదేశాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయకముందే ఢిల్లీ హైకోర్టు దీనిపై విచారణ జరిపి స్టే ఇవ్వడాన్ని లాయర్లు తప్పుబట్టారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ లాయర్లు సీజేఐకి ఈ లేఖ రాశారు. బెయిల్ బాండ్ అమలుపై స్టే ఇవ్వమని న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను కూడా సీజేఐకి రాసిన లేఖలో వారు ప్రస్తావించారు.
భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఇది న్యాయవాదుల మనస్సులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించిందని వారు తెలిపారు. అలాగే న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో న్యాయవాదుల వాదనలను నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారన్నారు. ఇది చాలా అసాధారణమైనదని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని, ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ సమర్థించాల్సిన అవసరం ఉందన్నారు. బెయిల్ విషయంలో కోర్టులు ఎక్కువ కాలపరిమితిని ఎలా ఇస్తున్నాయనే విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.