దేశవ్యాప్తంగా టెలికాం సంస్థల హవా తగ్గిపోయి ప్రస్తుతం రెండు, మూడు సంస్థల గుత్తాధిపత్యం మాత్రమే సాగుతోంది. ఇందులో జియో, ఎయిర్ టెల్, ఐడియా-వొడాఫోన్ సంస్థలు మాత్రమే ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. వీటిలోనూ జియో, ఎయిర్ టెల్ దే ఆధిపత్యం. ఇలా గంపగుత్తగా యూజర్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఈ రెండు సంస్థల్లో ఎయిర్ టెల్ కు చెందిన 37.5 కోట్ల మంది యూజర్ల డేటా లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎయిర్ టెల్ కు చెందిన 37.5 కోట్ల మంది భారతీయ కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్లో విక్రయానికి ఉంచుతున్నట్లు ఓ హ్యాకర్ తాజాగా ప్రకటించాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ యూజర్లలో కలకలం రేగింది. తమ డేటా హ్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్మేస్తుంటే ఎయిర్ టెల్ ఏం చేస్తుందంటూ యూజర్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఎయిర్ టెల్ దీనిపై స్పందించింది. ఈ వ్యవహారంపై ఆంతర్గత విచారణ నిర్వహించినట్లు తెలిపింది.
ఎయిర్టెల్ ఇండియా డేటా ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, ఎయిర్టెల్ సిస్టమ్ల నుండి ఎటువంటి ఉల్లంఘన జరగలేదని నిర్ధారిస్తున్నట్లు ప్రకటించింది. డార్క్ వెబ్ ఇన్ఫార్మర్ ద్వారా వెలువడిన తప్పుడు డేటా ఉల్లంఘనగా దీన్ని అభివర్ణించింది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే అంతకు ముందు డార్క్ వెబ్లో ఓ పోస్ట్ ప్రకారం, ‘xenZen’ అనే మారుపేరుతో హ్యాకర్ 37.5 కోట్ల మంది ఎయిర్టెల్ ఇండియా కస్టమర్ల మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ ఐడీ, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలతో కూడిన డేటాబేస్ను విక్రయానికి ప్రయత్నించాడు. క్రిప్టోకరెన్సీలో చెల్లించాల్సిన దీనికి 41 లక్షల రేటు పెట్టాడు.