E-PAPER

ఏపీలో ఆ రెండు ఎమ్మెల్సీ స్ధానాలూ ఏకగ్రీవమే..!

ఏపీలో తాజాగా ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు జరగాల్సిన ఎన్నికలు కాస్తా ఏకగ్రీవం అయ్యాయి. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఈ రెండు స్ధానాలకు ఈ నెల 12న వాస్తవంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రంగంలో నిలిచిన అభ్యర్ధులకు పోటీ లేకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. దీంతో తాజా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తర్వాత కూటమి సాధించిన రెండో గెలుపు ఇదే కానుంది.

 

ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్యతో పాటు మొహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఎన్నికలకు ముందే ఈ చేరికలు జరిగాయి. దీంతో వైసీపీ ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేసారు. ఈ రెండు సీట్లు ఖాళీ అయినట్లు నోటిఫై చేశారు. దీంతో ఈ రెండు సీట్లకు సి రామచంద్రయ్యతో పాటు జనసేన అభ్యర్ధి పి హరిప్రసాద్ ను కూటమి పోటీకి నిలిపింది.

 

ఈ మేరకు టీడీపీ అభ్యర్ధిగా రామచంద్రయ్య, జనసేన అభ్యర్ధిగా హరిప్రసాద్ నామినేషన్లు వేశారు. వీరిద్దరికి పోటీగా వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఏకగ్రీవంగా గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ఇవాళ ప్రకటించారు. వీరిలో రామచంద్రయ్య ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్సీగా పనిచేయగా.. హరిప్రసాద్ మాత్రం తొలిసారి ఎమ్మెల్సీ అయ్యారు. కూటమి అభ్యర్ధుల గెలుపుతో మండలిలో వైసీపీ హవా క్రమంగా తగ్గబోతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram