E-PAPER

మొబైల్ వినియోగదారులకు మరో షాక్..! ఇక నుంచి ఫోన్ నెంబర్‌కూ ఫీజు కట్టాల్సిందే..!

మొబైల్ వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ(TRAI) తీసుకొచ్చిన కొత్త సిఫార్సులే కారణం. కొన్నేళ్ల క్రితం సిమ్‌ కార్డు పొందాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉండేది. తర్వాతి కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్‌ కార్డులు జారీ మొదలైంది. దీని కారణంగా చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులను తీసుకునేవారు. సిమ్ కార్డు ఫ్రీ టాక్ టైమ్, ఇంటర్నెట్ ప్రయోజనాలు ఉపయోగించుకుని మరో సిమ్ కోసం ప్రయత్నిస్తుండేవారు.

 

అయితే, ఫోన్‌ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి వచ్చాక ఈ తరహా దుర్వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కొత్త సిఫార్సులకు సిద్ధమైంది. ఫోన్‌ నంబర్/ ల్యాండ్‌ లైన్‌ నంబర్‌కు ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇదే జరిగితే మొబైల్‌ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేస్తే ఆయా కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంది.

 

కాగా, సహజ వనరుల్లానే ఫోన్‌ నంబర్‌ కూడా చాలా విలువైనదని ట్రాయ్‌ పేర్కొంటోంది. ఫోన్‌ నంబర్లు అన్లిమిటెడ్ కాదు కాబట్టి దుర్వినియోగానికి చెక్‌ పెట్టాలని ట్రాయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫోన్లు డ్యూయల్‌ సిమ్‌ కార్డు ఆప్షన్‌తో వస్తున్నాయి. కొందరు రెండో సిమ్‌ కార్డు వాడుతున్నప్పటికీ.. ఎప్పుడో గానీ వాటికి రీఛారీజి చేయడం లేదు. అయితే, కస్టమర్‌ బేస్‌ తగ్గిపోతుందన్న భయంతో ఆయా టెలికాం కంపెనీలు కూడా అలాంటి నంబర్లను తొలగించట్లేదు.

 

ఈ క్రమంలోనే దీనికి చెక్పెట్టేందుకు తక్కువ వినియోగం కలిగిన నంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు జరిమానా కూడా విధించాలని ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, డిసెంబర్‌, 2023లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ మొబైల్ నంబర్‌కు ఛార్జీ వసూలు చేయాలన్న నిబంధన ఉండటం గమనార్హం. కాగా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, బెల్జియం, ఫిన్లాండ్‌, యూకే, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ట్రాయ్ చెబుతోంది.

 

మన దేశంలో 2024 మార్చి నాటికి 119 కోట్ల టెలిఫోన్‌ వినియోగదారులు ఉన్నారు. టెలీ సాంద్రత 85.69 శాతంగా ఉంది. మొబైల్‌ నంబర్ల డిమాండ్‌ కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ కొత్త నిబంధనలు తీసుకువచ్చే యోచన చేసింది. నంబర్లకు రుసుము వసూలు చేయడం వల్ల పరిమిత వనరులను సమర్థంగా కేటాయించేందుకు వీలుంటుందని తెలిపింది.

 

అయితే, ఒక్కో నంబర్‌కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా? లేదా నంబర్‌కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రాయ్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన సిఫార్సులను ట్రాయ్‌ త్వరలో కేంద్రానికి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram